
• గార్లదిన్నె పరిస్థితులను వివరించిన మండల ఎస్సీ సెల్ కన్వీనర్ నారాయణస్వామి
విజయవాడ, ఆగస్టు 18 (జనస్వరం): వైఎస్సార్సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో డాక్టర్ సాకే రుత్విక్ హృదయ్తో పాటు గార్లదిన్నె మండల ఎస్సీ సెల్ కన్వీనర్ మూలింటి నారాయణస్వామి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగనమల నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గార్లదిన్నె మండలంలోని స్థానిక పరిస్థితులను మూలింటి నారాయణస్వామి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా చర్చించినట్లు నాయకులు తెలిపారు. సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో సింగనమల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







