
కళ్యాణదుర్గం, మార్చి 3, (జనస్వరం) : కష్టాలను జయించి జాతీయ స్థాయికి ఎదిగిన కళ్యాణదుర్గం మండలం వర్లీ గ్రామానికి చెందిన కురుబ సహానకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించింది. పేదరికం, తండ్రి లేని లోటు, శారీరక వైకల్యం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆమె పారా బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభ చూపుతూ ముందుకు సాగుతోంది. ఇటీవల విజయనగరంలో ఫిబ్రవరి 25, 26 తేదీలలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సహాన అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా నిలిచి, భువనేశ్వర్లో మార్చి 6 నుంచి 11 వరకు జరిగే 7వ జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు అర్హత సాధించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సహాన పరిస్థితిని గుర్తించిన వర్లీ గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ స్పందించింది. ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ తరపున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసి ఆమెను ప్రోత్సహించారు. సహాన వంటి ప్రతిభావంతులు ఆర్థిక కారణాల వల్ల వెనకబడకూడదని, జాతీయ స్థాయిలో విజయం సాధించి రాష్ట్రానికి కీర్తి తేవాలని ట్రస్ట్ ప్రతినిధులు ఆకాంక్షించారు. భువనేశ్వర్లో జరిగే జాతీయ పోటీల్లో సహాన రాణించి విజయంతో తిరిగి రావాలని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








