
కడప, డిసెంబర్ 23, (జనస్వరం) : రాయలసీమ రీజియన్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో పుట్టపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్ పాల్గొన్నారు. కడప మార్కెట్ యార్డ్లో జేడీ రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్ కమిషనర్ శ్రీమతి విజయ సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ మార్కెట్ కమిటీల చైర్మన్ల విధి విధానాలు, రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, మార్కెట్ యార్డుల అభివృద్ధి అంశాలపై వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర, మౌలిక సదుపాయాల కల్పనపై చైర్మన్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో పూల శివప్రసాద్ మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అభివృద్ధి పనులు అత్యవసరమని, వాటికి సంబంధించి ఫైళ్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుశనగ సాగు తీవ్ర నష్టాల బాట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మొక్కజొన్న రైతులు పంట కొనుగోలుకు ముందుకు వచ్చే వారు లేక మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ మార్కెట్ కమిటీల చైర్మన్లు తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.









