మదనపల్లిలో ‘పెద్ది’ సినిమా ప్రమోషన్ సమావేశం

– మెగా అభిమానులు సేవా కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉన్నారు: దారం అనిత

– చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ నౌషాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం

మదనపల్లి, మే 24 (జనస్వరం ప్రత్యేక ప్రతినిధి) : నియోజకవర్గంలోని మదనపల్లి టౌన్‌లో చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ నౌషాద్ ఆధ్వర్యంలో రామ్‌చరణ్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘పెద్ది’కి సంబంధించిన ప్రమోషనల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ మదనపల్లిలో మెగా ఫ్యామిలీ అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు విడుదలైనప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భారీ స్థాయిలో వేడుకలు, ప్రమోషన్లు నిర్వహించడం ప్రత్యేకతగా మారిందన్నారు. మెగా అభిమానులు కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఒక బలమైన టీమ్‌గా పని చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నౌషాద్ నాయకత్వంలో ఈ టీమ్ వర్క్ మరింత ముందుకు సాగుతోందని ప్రశంసించారు. ఈ చిత్రం జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. 1980ల కాలంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో క్రికెట్ మరియు కుస్తీ క్రీడల చుట్టూ ఈ కథ సాగుతుందని తెలిపారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో భిన్నమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. యువత తప్పక చూడాల్సిన సందేశాత్మక చిత్రం ‘పెద్ది’ అని దారం అనిత పేర్కొన్నారు. మెగా కుటుంబం ఎప్పుడూ సమాజ సేవలో ముందుంటుందని, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని ఆమె పిలుపునిచ్చారు.

See also  విజయనగరం కామాక్షి నగర్ లో బార్ & రెస్టారెంట్ తక్షణమే తొలగించాలి : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణ