ప్రజా సమస్యలకు స్పందించడమే మా లక్ష్యం: ఎల్ సార్ బాబు

బళ్లారి, మార్చి 7, జనస్వరం : దేశంలో 1500కు పైగా మానవ హక్కుల సంస్థలు ఉన్నప్పటికీ, వాటిలో దక్షిణ ఆసియా మానవ హక్కుల వేదిక ప్రజా సమస్యలకు స్పందిస్తూ పని చేసే ప్రజాపర సంస్థగా నిలుస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎల్ సార్ బాబు తెలిపారు. శుక్రవారం బళ్లారి నగరంలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సంస్థ భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నమోదు చేయబడినదని చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 80 వేల మందికి పైగా సభ్యులతో ఈ వేదిక పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నదన్నారు. సమాజంలోని బలహీన వర్గాలు, అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలకు స్పందిస్తూ, బాధితుల తరఫున చట్టబద్ధంగా పోరాటం చేయడం తమ ధ్యేయమని పేర్కొన్నారు. సంస్థ పేరును దుర్వినియోగం చేయడం లేదా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకొని, సంస్థ నుండి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వలి పీర్, నాగప్ప, దూద్ బాషా, నవీన్, మహ్మద్ బాషా, మడివాల హుసేనప్ప, నవాజ్, అమీనా, సుజాత, పద్మావతి, హులిగెమ్మ తదితరులు పాల్గొన్నారు.

See also  పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి ఎస్. షాహిల్ భాష విరాళం