
బాధితురాలు కత్తి జ్యోతి ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ – తక్షణ చర్యలకు ఆదేశం.
నరసరావుపేట,ఆగస్టు 10 (జనస్వరం)
పట్టణంలోని కేసానపల్లి శివారు లలితాదేవి కాలనీకి చెందిన కత్తి జ్యోతి పల్నాడు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ని కలసి తమకు జరిగిన అన్యాయంపై ఒక నివేదికను సమర్పించారు. క్యాన్సర్ మరియు గుండె జబ్బుతో బాధపడుతూ మెంటల్లీ రిటార్డెడ్ కుమారుడితో జీవిస్తున్న తనపై గడిచిన జూన్ 25న రాత్రి వేళ భర్త (చిన్న), అతనితో సహజీవనం చేస్తున్న కొండెబోగు రూతు మరియు ఆమె కుమారుడు కలసి ఇంట్లోకి ప్రవేశించి దిండుతో ముఖాన్ని నొక్కి చంపేందుకు ప్రయత్నించారని బాధితురాలు వివరించారు. స్థానికులు రావడంతో నిందితులు వారు తెచ్చిన ఆటోను (AP 39TJ 4017) అక్కడే వదిలేసి పారిపోయారని,ఆ తర్వాత 100 కి కాల్ చేసి నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా గడిచిన 40 రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కేసు ఉపసంహరించుకోకపోతే తనను, తన కుమారుడిని చంపేస్తామని నిందితులు బెదిరిస్తున్నారని వాపోయారు. బాధితురాలి దుస్థితిని, ఫిర్యాదులోని అంశాలను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ, తక్షణమే స్పందించి నిందితులైన చిన్న, కొండెబోగు రూతు మరియు ఆమె కుమారుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని నరసరావుపేట రూరల్ పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మరియు ఆమె కుమారుడికి తగిన ప్రాణ రక్షణ కల్పించాలని ఆదేశించడమే కాకుండా, బాధితురాలిని ఇన్ని రోజులు స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై విచారణకు ఆదేశించారు. మహిళలు, దివ్యాంగులు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాధితులపై అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.








