నారాయణ కాలేజీల క్రింద ఉండే కాలువలను చూపిన తర్వాతే మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సర్వేపల్లి కాలువ జోలికి రావాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి నేడు నెల్లూరు నగరంలోని శెట్టిగుంట రోడ్డు, ఆత్మకూరు బస్టాండ్‌ తదితర సర్వేపల్లి కాలువ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు తమ నివాసాల కూల్చివేత అంశంలో జరుగుతున్న కుట్రలను వివరించి ఆ కుట్రలను అడ్డుకుంటామంటూ బాధిత ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో నారాయణ కాలేజీల క్రింద కాలువలు పోతున్నాయని తామొస్తే వాటిని వెలికితీస్తామని సవాళ్ళు  విసిరిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇప్పుడు ఆ విషయం మరచి పేదలు నివసించే సర్వేపల్లి కాలువ కట్టని కూల్చడం సిగ్గుచేటన్నారు. అనిల్‌ నిజాయితీపరుడైతే ముందు నారాయణ కాలేజీల క్రింద ఉండే కాలువలను నెల్లూరు ప్రజలకు చూపిన తర్వాతే ఈ కాలువని అనుకుని ఉన్న పేదల ఇళ్ళ జోలికి రావాలన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ 20 శాతం కంటే తక్కువ కోట్‌ చేసిన వారికే కాంట్రాక్టులు ఇచ్చే ఈ ప్రభుత్వంలో 88 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కాంట్రాక్టు 20 శాతం పెరిగి 102 కోట్ల రూపాయలకు ఏవిధంగా చేరిందని ప్రశ్నించారు. ఈ కాలువలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం కేవలం నెల్లూరు సిటీ పరిధి అయిన ముత్తుకూరు గేటు వద్దకు వచ్చి ఆగిపోతున్నదని, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోకి పోవట్లేదని బాధిత ప్రజలకు ఆయన వివరించారు. ఇది బినామీ వ్యవహారం తప్పించి ప్రజా సంక్షేమం కోసం, నగర అభివృద్ధి కోసం కాదని కేతంరెడ్డి దుయ్యబడుతూ ప్రజలకు వాస్తవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్‌ రెడ్డి, మోష, కార్తీక్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, హేమంత్‌ రాయల్‌, వెంకటరమణ, జీవన్‌, నాసీర్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

See also  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాములమ్మకు ఆర్థిక సహాయం అందించిన శ్రీమతి కాంతి శ్రీ గారు