
– టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ఈడుపుగంటి శ్రీనివాసరావు ధ్వజం
– శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియా విచ్చలవిడి
– ప్రజాస్వామ్యం కూని, వ్యక్తిస్వామ్యమే నడుస్తోందని విమర్శ
ఏలూరు, జూన్ 7 (జనస్వరం) : దెందులూరు నియోజకవర్గంలో శాండ్, ల్యాండ్, మైన్, వైన్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ఈడుపుగంటి శ్రీనివాసరావు ఆరోపించారు. దెందులూరులో ప్రజాస్వామ్యం కూనై కేవలం వ్యక్తిస్వామ్యం నడుస్తోందని, కార్యనిర్వహణ వ్యవస్థ అట్టర్ఫ్లాప్ అయ్యిందని మండిపడ్డారు. ఏలూరు అశోక్ నగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దెందులూరులో బెల్ట్షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పేకాట ఆడేవారిని డ్రోన్లతో పట్టుకుంటున్న పోలీసులు, జగన్నాధపురంలో రోజూ జరిగే కోడిపందాలను, పోలవరం మట్టి మాఫియాను ఎందుకు చిత్రీకరించరని ప్రశ్నించారు. మట్టితో వెళ్లే టిప్పర్లు, లారీలు వీరికి కనిపించవా అని నిలదీశారు. బెల్ట్షాపులపై మీడియా సమావేశం పెడితే రొట్టె ముక్కల కోసం ఎగబడే కుక్కల్లా కొందరు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్తో కొందరు తనపై వీడియోలు చేస్తున్నారని, చింతమనేని ప్రభాకర్ అంటే భయమని పేరు చెప్పలేదంటున్నారని తెలిపారు. “వందమంది చింతమనేని కలిస్తే నాకు ఒక వెంట్రుకతో సమానం” అని హెచ్చరించారు. తాను ఏ ఆడపిల్ల గురించి ఇబ్బందికరంగా మాట్లాడలేదని, ఏ వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేయలేదని స్పష్టం చేశారు. తన కూతురు గురించి నైతికతను దెబ్బతీసేలా మాట్లాడారని, వ్యక్తిగతంగా కాకుండా ఇష్యూ బేస్గా మాట్లాడాలని కోరారు. పట్టిసీమ కాల్వ మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవీ ప్రభుత్వం దగ్గర లేవని, అన్నీ ఎమ్మెల్యే చింతమనేని కబంధహస్తాల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. రోజూ విచ్చలవిడిగా టిప్పర్లతో మట్టి తోలుతున్నారని, సొంత పొలాల్లో మట్టి తోలుకున్నా ఎమ్మెల్యే సర్టిఫికెట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. దెందులూరులో తట్టెడు మట్టి కావాలంటే చంద్రమండలం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. చల్ల చింతలపూడిలో రైతు దాసరి బాబురావు తన భూమిలో హెచ్చుతగ్గులు సరిచేసుకునేందుకు అగ్రిమెంట్ చేసుకుంటే, ప్రభుత్వ అనుమతులు లేకుండా 15 అడుగుల గోతులు తవ్వారనే ఆరోపణతో జేసీబీతో వారి కారు తీసుకెళ్లారని తెలిపారు. కోటి 24 లక్షల రూపాయలు మైనింగ్ శాఖతో ఫైన్ వేశారని, పోలీసుల సమక్షంలోనే మట్టి దందా జరిగి, ఇల్లీగల్ క్వారీ చేశారని వారిపైనే ఫైన్ వేశారని ఆరోపించారు. దెందులూరులో సామాన్యులను దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.








