
నాగర్ కర్నూల్, అక్టోబర్ 10, (జనస్వరం) :
అచ్చంపేట నియోజకవర్గంలో రహదారి దుస్థితి రోజురోజుకు మరింత తీవ్రతరం అవుతుండగా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా స్థానిక MLA ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ నుంచి ఎల్లికల్ మీదుగా కల్వకుర్తికి కలిసే సుమారు 12 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని జనసేన నాయకుడు అల్లే జగదీశ్వర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి మరింత ప్రమాదకర పరిస్థితికి చేరిందని, గ్రామాల మధ్య రాకపోకలు దాదాపు అస్తవ్యస్తమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులే కాకుండా, అత్యవసర పనుల కోసం ప్రయాణించే సాధారణ ప్రజలూ రోజూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల గుంతలు పెద్ద గొయ్యిలుగా మారి ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు.
జగదీశ్వర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “అచ్చంపేట ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అయితే, నియోజకవర్గ సమస్యలు ముందుగా చూడాలి. కానీ ఉపఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొనడం ప్రజలపై ఉన్న బాధ్యతను మరచినట్టే. జూబ్లీహిల్స్ ఓట్లు వేసినా, MLA అయితే అచ్చంపేట ప్రజలకే సేవ చేయాలి కదా?” అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు ఇప్పటికే శాంక్షన్ అయ్యిందని అధికారులు చెబుతున్నా, శాంక్షన్ లెటర్ ఎక్కడుందో, కాంట్రాక్టర్ ఎవరో కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. శాంక్షన్ చేసిన రోడ్డు పనులు మొదలవ్వడానికి ఈవిధంగా ఆలస్యం ఎందుకు జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఒకసారి ఈ రహదారి మీద ప్రయాణిస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు అర్థమవుతాయని సూచించారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించకపోతే ప్రజా పోరాటాలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అల్లే జగదీశ్వర్ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తామని, రోడ్డు వెంటనే నిర్మాణం ప్రారంభం అయ్యేలా నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు.










