
శేరిలింగంపల్లి, జూలై 23 (జనస్వరం): నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 24న చేపట్టిన దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ఏఐఎఫ్డీవై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మియాపూర్ స్టాలిన్ నగర్లో ఏఐఎఫ్డీవై గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి. మధుసూదన్, కార్యవర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, ఎండి సుల్తానా బేగం, డి. శ్రీనివాసులు గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన పదకొండున్నరేళ్లలో 150 సార్లు పరీక్షా పత్రాలు లీకయ్యాయని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు విమర్శించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరుగుతున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలోని యువజన సంఘాలన్నీ విద్యాసంస్థల బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.








