
– ప్రత్యేకంగా అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గుంటూరు, జులై 29, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ), డిప్యూటీ కన్జర్వేటర్ ఆవుల చంద్రశేఖర్ ను రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ఇటీవల లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హౌస్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీఈవో చంద్రశేఖర్ కృషిని పలువురు ప్రశంసించారు. గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా బుధవారం నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన సమావేశం ఇందుకు వేదికైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరై సిఈఓ విశిష్ట సేవలను ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టికృషి తోనే తనకు అంతర్జాతీయ అవార్డు దక్కిందని ఏపీఎంఏపీ సిఈఓ ఆవుల చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. తన విజయం వెనక ఎందరో కృషి దాగి వుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిఈఓ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించేలా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి సత్యకుమార్ కు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, శాసనసభ్యులు బొబ్బిలి రంగారావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పి. మల్లికార్జున రావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె గంగాధర రావు, పిసిసిఎఫ్ డా. పి.వి. చలపతిరావు, పలువురు విద్యార్థులు, పర్యావరణవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.








