
*సమాజసేవలో సార్థకత వెతుక్కుంటున్న శ్రీ అయ్యప్పస్వామి దేవస్థాన చైర్మన్ బచ్చు సత్యనారాయణ దంపతులు*
*పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకల్లో అనాథలు, పేదలకు ఉదార స్వభావంతో సాయం*
నరసరావుపేట, ఆగస్టు 13 ( జనస్వరం)
పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసియున్న శ్రీ అయ్యప్పస్వామి దేవస్థాన చైర్మన్, ప్రముఖ మెడికల్ వ్యాపారి బచ్చు సత్యనారాయణ సతీమణి రమాదేవి దంపతులు తమ పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమాజ సేవలో సరికొత్త ఆదర్శాన్ని నిలిపారు. కేవలం ఆడంబరాలకే పరిమితం కాకుండా తమ శుభదినాన్ని నిరుపేదల ఆకలి తీర్చే పర్వదినంగా మలచుకున్న ఈ దంపతులు సత్తెనపల్లి రోడ్డులోని మెడికల్ కాంప్లెక్స్ ఆవరణలో బచ్చు రమాదేవి చేతులమీదుగా సుమారు 50 నిరుపేద కుటుంబాలకు కావలసిన నిత్యావసర సరుకులు మరియు గ్రోసరీ కిట్లను ఉదారంగా పంపిణీ చేశారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆధ్యాత్మిక సేవే కాకుండా సామాజిక సేవలోనూ ముందంజలో ఉన్న ఈ దంపతుల ఉదారతను చూసి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, దేవస్థాన కమిటీ సభ్యులు మరియు మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వారికి జన్మదిన, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రతి ఏటా తమ వ్యక్తిగత వేడుకలను నిరుపేదల సేవకే అంకితం చేస్తూ ఇతరులకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్న బచ్చు సత్యనారాయణ దంపతుల దాతృత్వం అత్యంత అభినందనీయమని, శ్రీ అయ్యప్పస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కొనియాడుతూ, సరుకులు అందుకున్న పేద ప్రజలు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.








