
పిఠాపురం, డిసెంబర్ 24, (జనస్వరం) : ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలో నిర్వహించిన పదవి బాధ్యత కార్యక్రమంలో జనసేన తరపున నియమితులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం చేశారు. హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని, అలా చేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో పారదర్శకత, నిబద్ధత కీలకమని, అంకితభావంతో పనిచేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ పాల్గొన్నారు. పదవి బాధ్యత కార్యక్రమంలో తమ అధినేత ఇచ్చిన సందేశం తమలో అపారమైన స్ఫూర్తిని నింపిందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో సుపరిపాలన అందించే దిశగా ఐక్యంగా పనిచేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలు కొనసాగిస్తామని పెంకే జగదీష్ వెల్లడించారు.









