
ప్రస్తుతం మానవులను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిరోధించే కార్యక్రమంలో రైల్వేకోడూరు ప్రజానీకానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని జనసేన పార్టీ స్థానిక నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆరోపించారు. మార్చి నెల రెండవ వారంలో లేదా మూడవ వారంలో మొదటి కోవ్యాక్సిన్ టీకా డోస్ వేసుకున్న ప్రజలకు ఇంతవరకు రెండవ టీకా వేయడం లేదన్నారు. టీకా స్టాక్ లేకపోవడం కారణంగా రెండో డోస్ అందించడంలో హెల్త్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక నాయకత్వం, హెల్త్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మిగతా జిల్లాలలో ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి అన్నారు. 2వ డోస్ సకాలంలో అందని కారణంగా ప్రజలు తాము తెలియకుండానే కరోనా బారిన పడుతున్నారని భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కడప జిల్లాకు పక్కనే గల జిల్లాల్లో దొరికే ఈ రకం టీకలు కడప జిల్లాలోనే ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకర వార్త అంటూనే అన్నిరకాల సదుపాయాలను కోడూరు కోవిడ్ సెంటర్ లో ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ నిల్వలను తగిన స్థాయిలో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు కోవ్యాక్సిన్ రెండవ డోసు ప్రజలకు త్వరలో అందిస్తారని కోరుతున్నామన్నారు. తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.








