భోగాపురంను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే లోకం నాగ మాధవి

 

విశాఖపట్నం, నవంబర్ 15, (జనస్వరం) : భోగాపురంను అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో జరుగుతున్న “వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్-2025” కార్యక్రమానికి ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భోగాపురం ప్రాంతంలో భారీగా మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందని, రాబోయే అంతర్జాతీయ విమానాశ్రయం కారణంగా ఇక్కడ గృహ మరియు వాణిజ్య నిర్మాణాల డిమాండ్ మరింత పెరగనుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ అభివృద్ధి దిశలో బిల్డర్లు మరియు రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకు వచ్చి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాణ రంగ ప్రతినిధులు, బిల్డర్లతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రత్యేకంగా మాట్లాడి భోగాపురం ప్రాంతంలో జరుగుతున్న పలు ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడంలో ప్రభుత్వ ప్రాధాన్యతపై ఆమె వివరణ ఇచ్చారు. భోగాపురాన్ని సమగ్ర ప్రణాళికతో, ఆధునిక మౌలిక వసతులతో, పర్యావరణ హిత చర్యలతో కూడిన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. నాణ్యమైన, సరసమైన గృహ నిర్మాణాలకు ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భోగాపురం చుట్టుపక్కల కొనసాగుతున్న అభివృద్ధి పనుల వేగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు నిర్మాణ రంగ నిపుణులు భాగస్వాములు కావడం అత్యంత అవసరమని అన్నారు.

 

See also  బడ్డుకొండపేటలో గ్రామ గ్రామాన జనసేన కార్యక్రమం నిర్వహించిన విజయనగరం జనసేన నాయకులు