
అమరావతి, అక్టోబర్ 13, (జనస్వరం) : రాష్ట్రంలో వికలాంగుల నిర్దారణ కోసం సదరం స్లాట్ బుకింగ్ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ ప్రకటించారు. నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన స్లాట్లను ప్రజలు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ ధ్రువీకరణ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి సదరం సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎరియా ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మరియు దృష్టి వైకల్యం కలిగినవారికి నిర్ధారణ సేవలు అందించనున్నట్లు తెలిపారు.
సోమవారం రోజున సి.హెచ్.సిల్లో శారీరక వైకల్యం ఉన్నవారికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించబడిందని చక్రదర్ పేర్కొన్నారు. ప్రజలు నిర్ణీత సమయాల్లో స్లాట్లు బుక్ చేసుకుని ఆసుపత్రులను సందర్శించాలని ఆయన సూచించారు.








