
అమరావతి, ఫిబ్రవరి 12, (జనస్వరం) : బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే రకమైన సంప్రదాయ వస్త్రధారణలో సభకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు శివతత్వానికి ప్రతీకగా చీరలు ధరించి సభలో పాల్గొన్నారు. అనంతరం వారు కలిసి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా శక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ముందస్తు శివరాత్రి వేడుకల సందడి శాసనసభ లాబీల్లో కనిపించగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్. సవితతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాంటి వేడుకలు నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.








