
అనంతపురము, ఫిబ్రవరి 28: సుప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త, కవి, డాకర్ ఉమర్ ఆలీషా సాహిత్యానికి విస్తృత ప్రచారం అవసరమని విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. శనివారం లలిత కళా పరిషత్ వేదికగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య విద్య – ఆధ్యాత్మిక పరము షష్టము పఠాధి పతులు ‘కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా 141 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ ఉమర్ ఆలీష సాహితీ సమితి జిల్లా అద్యక్షులు షేక్ రియాజుద్దీన్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా విచ్చేసిన డాక్టర్ పతికి రమేష్ నారాయణ మాట్లాడుతూ కవిగా, పార్లమెంటు సభ్యునిగా, పీఠాధిపతులుగా బహుముఖ . ప్రజ్ఞతో తెలుగు భాషా సాహిత్యానికి విశేష కృషి చేశారన్నారు. కలమతాలకు అతీతంగా సూఫీ సిద్ధాంతంతో ఎంతో మందిని జ్ఞాన మార్గంలో నడిపించిన డాక్టర్ ఉమర్ ఆలీషా రచనలు చాలా మందికి అందుబాటులో లేకపోవడం విచారకర మన్నారు. అయితే భీమవరం దాకర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి వారు రాష్ట్రస్థాయి పోటీలు పెట్టడం ద్వారా కొంతలో కొంత వారి సాహిత్యానికి తగిన ప్రచారం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సాహిత్యం వ్యాప్తి చేయడానికి అందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా 7, 10 తరగతుల తెలుగు పాఠ్యాంశాలలో డాక్టర్ ఉమర్ ఆలీషా రచవలు చేర్చడంలో అనంతవాసుల కృషిని ప్రత్యేకించి అభినందించారు. అంతకు ముందు డాక్టర్ ఉమర్ ఆలీషా చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి సాహిత్య రచనలను పరిచయం చేస్తూ, ఆలపించిన పద్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి గుంటి మురళీ కృష్ణ, కార్యదర్శి సుంకర రమేష్, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నగరూరు రసూల్, తెలుగువెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షులు టి. వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బడా శ్రీనివాస రెడ్డి, అనంతపురం మాసపత్రిక ఎడిటర్ తోట నాగరాజు, విశాలాంధ్ర విశ్రాంత మేనేజర్ చెట్ల ఈరన్న, కళాకారులు కె. పోమిరెడ్డి, జె.కే రామాంజనేయులు, కార్యవర్గ సభ్యులు శివ, కళాకారులు జి.జె. ఎర్రిస్వామి, మల్లెల జయరామ్, ఉమర్ అలీషా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్, సుదర్శన్ రెడ్డి, కళాకారులు రామగోవిందు, వి ఆదినారాయణ రెడ్డి, అస్లాంబాష, లోకేష్, తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








