
– అనంతపురం జిల్లాలో MHPS కార్యకర్తల సమావేశం
– మన్నల సుబ్రమణ్యం అధ్యక్షతన సమావేశం
అనంతపురం రూరల్, సెప్టెంబర్ 28, జనస్వరం : అనంతపురం మండలం రాచానపల్లి గ్రామం ఎస్సీ కాలనీలోని విన్సెంట్ ఫెర్రర్ కమ్యూనిటీ హాల్లో MHPS కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MHPS రాష్ట్ర అధ్యక్షులు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మన్నల సుబ్రమణ్యం అధ్యక్షతన వహించారు.
ఈ సందర్భంగా మన్నల సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో MHPS ఆధ్వర్యంలో కార్యక్రమాలు, పోరాటాలు విస్తృత స్థాయిలో నిర్వహిద్దామని తెలిపారు. సామాన్యుల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ మంజూరు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడంలో విస్తృతంగా ధర్నాలు, ఆందోళనలు చేపడదామని సూచించారు.
రాష్ట్ర అధ్యక్షులు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 32 డిగ్రీలు, రెండు పీహెచ్డీలు సాధించి భారతదేశానికి న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సంస్కర్తగా అహర్నిశలు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన కులవివక్షతకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనకు పోరాడినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనలో ఆయన కీలకపాత్ర పోషించారని, అలాంటి మహనీయుడి ఫోటో భారత కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించకూడదని ప్రశ్నించారు. త్వరలో శింగనమల ఎస్సీ నియోజకవర్గంలో MHPS ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు చేపడతామని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం సభకు విచ్చేసిన వారికి మన్నల సుబ్రమణ్యం తన సగృహంలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. రామతీర్థ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూటూరు రామాంజనేయులు, రాయలసీమ అధ్యక్షులు చియ్యేడు నారాయణస్వామి, జిల్లా అధ్యక్షులు హెచ్. నాగన్న మాదిగ, ఉభయ జిల్లాల అధ్యక్షులు కేఎస్. రాము, జిల్లా అధికార ప్రతినిధి వరకూటి కాటమయ్య తదితరులు పాల్గొన్నారు.








