
– చోద్యం చూస్తూ పట్టించుకోని అధికారులు
గోకవరం, జూలై 23 (జనస్వరం) : ఎంతో ప్రతిష్టాత్మకమైన విధానాలతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీలు) ద్వారా కోట్లాది రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధి, సామాజిక సాధికారత కోసం కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా పోర్జరీల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్వాక్రా వి.ఓ.ఏ చదరం వెంకటలక్ష్మిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆమెను వెనకేసుకొస్తూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో పలువురు మహిళలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక నేరాల వెనుక ఉన్న కుట్రను పూర్తిగా ఛేదించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఉద్యోగాల నుంచి తొలగించి చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుమ్మళ్లదొడ్డి గవరపేట డ్వాక్రా మహిళా సంఘాలకు న్యాయం చేయడంతో పాటు, చదరం వెంకటలక్ష్మి బారినుంచి తమను కాపాడాలని, ఆమెను వి.ఓ.ఏగా కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఆమెపై తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు కూడా వెనుకాడబోమని డ్వాక్రా మహిళలు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి వరలక్ష్మి (గ్రూపు అధ్యక్షురాలు), అనుపోజు సరస్వతి (కార్యదర్శి), ఆడారి మంజు, సూరిశెట్టి నాని, అబ్బిరెడ్డి చిన్ని (గ్రామ ఉపసర్పంచ్), సూరిశెట్టి రామారావు, సూరిశెట్టి సంధ్య, సూరిశెట్టి మహాలక్ష్మి తదితర బాధిత డ్వాక్రా మహిళా సభ్యులు పాల్గొన్నారు.








