
విశాఖ ప్రమాదాలు బాధాకరం : పవన్ కళ్యాణ్
ఈ మధ్య కాలంలో విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు చూస్తున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకూ రసాయన పరిశ్రమలు విశాఖలో ఉండడం వలన ఇక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న ఎల్.జీ పాలిమర్స్, నిన్న సాయినార్ ఫార్మా, నేడు రాంకీ ఫార్మా సిటిలోని సాల్వెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకోవడం విశాఖ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రశాంతమైన వాతావరణం గల విశాఖలో వరుస ప్రమాదాలు చేసుకుంటున్న ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, ప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు? పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించట్లేదని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్ మరియు రసాయనాలు నిల్వ చేస్తున్నపుడు రక్షణ ఏర్పాట్లు పటిష్టంగా ఎందుకు ఉంచడం లేదని, ఈ పేలుడు ఎందుకు సంభవించినదో ప్రజలకు చెప్పాల్సిన జవాబుదారీతనం ప్రభుత్వానికి ఉందని ప్రజలు అంటున్నారు. సాల్వెంట్ పరిశ్రమలో పేలుడు సంభవించినప్పుడు దాని తీవ్రత శబ్ధం దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు వినిపించందంటే ఎంత భయంకరమైన ప్రమాదం సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. అగ్ని కీలలను అదుపు చేయడానికి తీవ్రంగా కష్టపడ్డారని తెలుస్తోంది. ఈ సాల్వెంట్ కర్మాగారం ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్రంగా గాయాలు అవడంతో, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారం ఆవరణలో కాలిన తీవ్ర గాయాలతో కనిపించిన మృతిదేహం, అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీ కె.శ్రీనివాస్ అని తెలుస్తోంది. ఈ పరిస్థితి ఘటనపై జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ప్రమాద ఘటనపై విశాఖలోని జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ టి. శివ శంకర్ తో పరిస్థితిని ఆరా తీశారు పవన్ కళ్యాణ్ గారు. మృతుని కుటుంబానికి, గాయపడిన వారికి సంతృప్తికరమైన రీతిలో పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు పరిహారం అందేవరకూ స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ప్రమాదంపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని కోరారు.









