
పూతలపట్టు, (జనస్వరం) : “గెలుపోటములు సహజం.. ఓటమి గెలుపుకు నాంది.. భవిష్యత్తు మనదే”. అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నరిగన్నగారి తులసీ ప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య గార్లు అన్నారు. పరిషత్ ఎన్నికల ఓట్ల ఫలితాలు అనంతరం జనసేన పార్టీ తరపున నిలిచి, పోటీచేసి అధికార పార్టీ వారికి, ప్రతిపక్ష పార్టీ వారికి గట్టిపోటీ ఇచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజలక్షేమం కోసమే పరిశ్రమిస్తూ, అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నవ యువ నాయకులందరి లక్ష్యం భావితరాల బంగారు భవిష్యత్తు కోసమేనని అన్నారు. ప్రజాక్షేత్రంలో జనసైనికులందరూ అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే భవిష్యత్తు మనదేనని చెప్పారు. జనసేన పార్టీ అభ్యర్థులు యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లి (రాచూరు) కుమార్ 400 ఓట్లను సాధించడం, పూతలపట్టు మండలం లోని వేపనపల్లికి చెందిన మహేష్ 410 ఓట్లను సాధించడం, ఐరాల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన నరిగన్నగారి నాగలక్ష్మిలు 1261ఓట్లను సాధించడం విశేషం అన్నారు. పోటీలో నిలబడడమే గొప్ప విషయం అని అలాంటిది ముచ్చెమటలు పట్టించిన ఘనత జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకే దక్కిందన్నారు. ఒక్క రూపాయి పంచకుండా, బిర్యానీ, మందు పంచకుండా నీతీ, నిజాయితీగా పోరాడి ఓడినా నైతిక విజయం సాధించారని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టించిన జనసేన పార్టీ నేతలకు, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మన జనసైనికులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికల్లో ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి సమిష్టిగా పోరాడిన నాయకులకు, ఆదరించిన యావన్మంది ప్రజానీకానికీ పేరుపేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదమరి, తవణంపల్లి, బంగారుపాళ్యం, ఐరాల మండలాల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.








