
నెల్లిమర్ల, జనవరి 02, (జనస్వరం) : రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి అన్నారు. భోగాపురం మండలం నందిగాం పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో రైతులు భూ సంబంధిత సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పారదర్శకంగా పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, హక్కుల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా తప్పులు కనిపిస్తే వెంటనే సరిచేసి అర్హులైన ప్రతి రైతుకు భరోసా కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి, జాప్యం లేకుండా పంపిణీ పూర్తిచేయాలని కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








