చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా : తుమ్మల రామస్వామి బాబు

రామస్వామి

పిఠాపురం, అక్టోబర్ 23, (జనస్వరం) : చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థిక భరోసా కల్పిస్తుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. శుక్రవారం పిఠాపురం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) భవనంలో నిర్వహించిన చిరు వ్యాపారస్తుల లోన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న చిరు వ్యాపారస్తులను గుర్తించి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ముందుకు వచ్చి రుణాలు మంజూరు చేసిందన్నారు. తోపుడు బండ్లపై, చిన్న స్థాయి వ్యాపారాలు నిర్వహించే వారికి ప్రధానమంత్రి స్వనిధి 2.0 పథకం ద్వారా రుణాలు అందించి వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో వ్యాపారాలు కొనసాగించగలిగే స్థాయికి చిరు వ్యాపారస్తులు చేరుకోవాలన్నదే తమ ఆశయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా రుణాలు పొందిన వారు సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే, తిరిగి వారికి మరింత ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేయడం అభినందనీయమని తుమ్మల రామస్వామి బాబు అన్నారు. క్రెడిట్ కార్డు విధానంలో రుణాల చెల్లింపులకు డిజిటల్ మార్కెటింగ్‌ను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని, డిజిటల్ లావాదేవీల వల్ల చిరు వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలోని తోపుడు బండ్ల వ్యాపారస్తులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు లోన్ చెక్కులు మరియు క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు చల్ల లక్ష్మి, పెంకే జగదీశ్, మొగలి అప్పారావు, కంచర్ల భవాని శంకర్, పిఠాపురం కోఆపరేటివ్ సోసైటీ చైర్మన్ చెల్లుబోయిన నాగేశ్వరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉమ్మిడి ఆమెలేశ్వరి, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ బొజ్జ రవికుమార్, పిఠాపురం జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  ఎల్‌నినో ప్రభావంపై కందుకూరు రైతులకు అవగాహన కార్యక్రమం