మాకొడికి పాఠశాలకు ఉపాధ్యాయుడు వి.ఏ. వెంకటేశులు రూ.40,116 విరాళం

శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత అని చాటి మాకొడికి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి.ఏ. వెంకటేశులు ఉదారతను ప్రదర్శించారు. పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం రూ.40,116 నగదును స్వచ్ఛందంగా విరాళంగా ప్రకటించి, ఆ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులకు ఉపాధ్యాయ బృందం సమక్షంలో అందజేశారు. ప్రస్తుతం మాకొడికి తాండాలో ఎస్జీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశులు, తన వృత్తిపట్ల ఉన్న నిబద్ధతతో పాటు గ్రామంలోని విద్యార్థులు మెరుగైన వసతులతో చదువుకోవాలనే సంకల్పంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసనసభ్యుడు అమిలినేని సురేంద్ర బాబు ఇచ్చిన పిలుపుతో గ్రామంలో విద్యారంగంపై చైతన్యం పెరిగిందని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఒక ఉపాధ్యాయుడే స్వయంగా ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా అందించడం పట్ల తోటి ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు వెంకటేశులను ఘనంగా అభినందించారు.

See also  యువతకు క్రీడలతో చెడు వ్యసనాలపై అవగాహన అవసరం : తుమ్మల బాబు