
బళ్లారి, మార్చి 11, జనస్వరం : మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగల శక్తి కలిగినవారని, అలాంటి మహిళలకు టైలరింగ్ వృత్తి స్వావలంబనకు మంచి మార్గమని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు హంపి రమణ అన్నారు. శిక్షణ ద్వారా నైపుణ్యం పెంపొందించుకున్న మహిళలు తమ ప్రతిభతో కుటుంబానికి ఆర్థిక బలంగా నిలవగలరని ఆమె పేర్కొన్నారు.
బుధవారం బళ్లారి నగరంలోని సింధిగీ కంపౌండ్లో ప్రతిభ మహిళా మండలి (రి) ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి ఆమె మాట్లాడారు. ఉన్నత విద్య లేకపోయినా కృషి, నైపుణ్యంతో మహిళలు తమ జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుని స్వావలంబిగా ఎదగగలరని హంపి రమణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ మహిళా మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర మాట్లాడుతూ, మహిళల ఆర్థిక సాధికారత కోసం సంస్థ తరచూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు తమ ప్రతిభతో స్వయం ఉపాధి పొందుతూ ఇతర మహిళలకు కూడా ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సాధన హిరేమఠ్, ప్రత్యేక అతిథులుగా న్యాయవాది విజయలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుగుణ, పుష్ప పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన అనేక మంది మహిళలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.








