
వార్షిక తనిఖీలు నిర్వహించిన సత్తెనపల్లి డి ఎస్పీ హనుమంతరావు
క్రోసూరు/ పెదకూరపాడు. డిసెంబర్ 07( జనస్వరం).
సత్తెనపల్లి డివిజన్ పోలీసు అధికారి హనుమంతరావు (SDPO)క్రోసూరు పోలీస్ స్టేషన్ మరియు పెదకూరపాడు సర్కిల్ కార్యాలయాలను సందర్శించి వార్షిక తనిఖీలు (Annual Inspection) నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసులు, స్టేషన్కు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, స్టేషన్ పరిసరాల శుభ్రత, భద్రతా చర్యలు, వసతులు తదితర అంశాలను సుదీర్ఘంగా పరిశీలించారు. అలాగే సర్కిల్ కార్యాలయంలోని పరిపాలనా విధులు, రికార్డుల సంకలన విధానం, సిబ్బంది పనితీరుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

పెండింగ్లో ఉన్న UI కేసులను వీలైనంత త్వరగా తగ్గించాలని, అన్ని స్టేషన్ రికార్డులను ఎలాంటి ఆలస్యం లేకుండా అప్డేట్ చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేయాలని ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అలాగే నేర నియంత్రణ, ప్రజా భద్రత, బాధితులకు త్వరిత న్యాయం అందే విధంగా దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిష్ఠ, పారదర్శకత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.తనిఖీల అనంతరం క్రోసూరు పోలీస్ స్టేషన్ మరియు పెదకురపాడు సర్కిల్ కార్యాలయాల నిర్వహణ, పనితీరు, వసతులు సంతృప్తికరంగా ఉన్నాయని SDPO వెల్లడించారు.








