
– జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ఆదేశానుసారం సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు
విజయవాడ, (జనస్వరం) : ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పో వెంకట మహేష్ ఆదేశానుసారం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ జనవరి 1న ప్రకటిస్తున్నామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ప్రకటించక పోగా ప్రభుత్వ ఉద్యోగస్తుల విరమణ వయస్సుని 62 సంవత్సరాలకు పెంచుతున్నట్టు ప్రకటించి నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారన్నారు. 2.35 లక్షల మంది ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత మీద నీళ్లు చల్లారు జీఓ-39 ప్రకారం ప్రతి సంవత్సరం 10,143 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువతని రోడ్డున పడేసారని అన్నారు. నిరుద్యోగ యువత మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి వారి సమస్యల్ని తెలియజేయగా ఆ సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించి రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధి కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకటమహేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దానికి యువత కూడా భారీ ఎత్తున మద్దతు లభించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయో పరిమితి 62 సంవత్సరాలకి పెంచడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నిరుద్యోగ యువతకి ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని, మీరు చేసే ప్రతి పోరాటానికి జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు అజాస్ షేక్, చిన్నారావు మరుపిళ్ల తదితరులు పాల్గొన్నారు.








