
నెల్లిమర్ల, మార్చి 4, (జనస్వరం) : ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు రహదారుల పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మంగళవారం శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న రోడ్ల రిసర్ఫేసింగ్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. పూసపాటిరేగ మండలం కుమిలి పంచాయతీ పరిధిలో పోరం–జమ్ము ఆర్అండ్బీ రోడ్డుకు భూమిపూజ నిర్వహించారు. ఈ రహదారి వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కీలకమని స్థానిక రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేయించి రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. పాత రహదారులపై ఉన్న గుంతలను పూడ్చి కొత్తగా బిటుమినస్ కాంక్రీట్ పొర వేయడం ద్వారా రోడ్ల నాణ్యతను మెరుగుపరుస్తున్నట్లు అధికారులు వివరించారు. దీని వల్ల రహదారుల ఆయుష్షు పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ప్రమాదాల శాతం కూడా తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఎన్డీయే కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









