మాకొడికి పాఠశాలకు రమావత్ జగన్నాథ్ నాయక్ రూ.2,00,116 భారీ విరాళం

శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : అక్షర దేవాలయాల అభివృద్ధికి గ్రామస్థులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ మాకొడికి తాండాకు చెందిన రమావత్ జగన్నాథ్ నాయక్ ఉదారతను చాటుకున్నారు. మాకొడికి ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం ఆయన రూ.2,00,116 విరాళాన్ని ప్రకటించి, ఆ మొత్తాన్ని శాసనసభ్యుడు అమిలినేని సురేంద్ర బాబు చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాల మౌలిక వసతుల మెరుగుదలకు ఈ నిధులు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు, విద్యాశాఖ అధికారులు ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ పాఠశాల అభివృద్ధిలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని జగన్నాథ్ నాయక్ పేర్కొన్నారు. తమ నాయకుడు సురేంద్ర బాబు సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యుడు సురేంద్ర బాబు మాట్లాడుతూ, గ్రామ పాఠశాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో విరాళం అందించడం గొప్ప విషయమని ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధిలో ఇలాంటి దాతలు ముందుకు రావడం విద్యార్థులకు ప్రోత్సాహకరమని అన్నారు. దాతలు రమావత్ జగన్నాథ్ నాయక్, పద్మావతి దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ ప్రజలు జగన్నాథ్ నాయక్ దంపతులను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

See also  శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షునిగా గుత్తా హరి