
పిఠాపురం, ఫిబ్రవరి 11, (జనస్వరం) : పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన భగవంతుని పిల్లల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గంటల వ్యవధిలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు లేక ఇబ్బందులు పడుతున్న కరణం సత్య, కరణం చంటి అనే ఇద్దరు యువకులు తమను ఆదుకోవాలంటూ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లగానే, కేంద్ర బృందం ద్వారా వెంటనే వారితో మాట్లాడి భరోసా కల్పించారు. అనంతరం ఫైవ్ మెన్ కమిటీని అక్కడికి పంపించాలని ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు ఓదురి కిషోర్ మాదాపురం గ్రామానికి చేరుకుని యువకులను పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున వారికి ఆర్థిక భరోసా, విద్యా భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు లేక నివాసం, చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం పవన్ కళ్యాణ్ హృదయాన్ని కదిలించిందని, అందుకే తక్షణమే సహాయ చర్యలు చేపట్టినట్లు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఈ సందర్భంగా భగవంతుని పిల్లలకు ప్రతి నెల ఇస్తున్న సహాయంలో ఈ విద్యార్థులను కూడా చేర్చే ప్రయత్నం జరుగుతుందని, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతినెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థి రోజూ స్కూల్కు లిఫ్ట్ మీద వెళ్లే పరిస్థితిని గమనించి, గోదావరి ఈస్టర్న్ డెవలప్మెంట్ చైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్ ఆర్థిక సహకారంతో ఒక సైకిల్ అందించారు. పిఠాపురం మండల ఇంచార్జ్ వెన్నా జగదీష్ 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం ద్వారా వసతి కోసం స్థలం కేటాయిస్తే, చేయూత సంస్థ ఇల్లు నిర్మించేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఉపాధ్యక్షులు నిమ్మనా దుర్గాప్రసాద్, జ్యోతుల సతీష్, జనసేన పార్టీ ఇంచార్జ్ కర్ణం శ్రీనివాసరావు, భాస్కర్, వీర మహిళలు తోలేటి శిరీష, కోలా దుర్గ, పిల్ల రమ్య జ్యోతి, ఇంటి వీరబాబు, గంట రమణ, కరణం రాజేంద్ర, గంజి గోవిందరాజులు, అడపా శివరామకృష్ణ, చాగంటి కోటేశ్వరరావు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








