ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

యలమంచిలి, జూలై 24 (జనస్వరం): పట్టణంలోని యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, రహదారులు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, అందిన ప్రతి ఫిర్యాదుపై సత్వరమే స్పందించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనకాపల్లి జిల్లాకు జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.2,050 కోట్ల నిధులు మంజూరు చేసి జీవో విడుదల చేయించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పంచదార్ల కొండ వ్యవహారంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆ అంశంపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. విచారణకు అధికారిక యంత్రాంగం సిద్ధమైందని, సంబంధిత ఏజెన్సీలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. కావాలని కుట్రలు పన్ని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిజానిజాలను వెలికితీసి కుట్రను తప్పకుండా ఛేదిస్తామని స్పష్టం చేశారు. అలాగే, పంచదార్ల కొండతో పాటు కొండకర్ల ఆవ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తించాలని గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

See also  అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన జనసైనికులు