
ధర్మవరం, మే 25 (జనస్వరం) : రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామంలో 35కు పైగా ఎంఎస్ఎంఈ పార్కులు, ఎఫ్ఎఫ్సీల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మంత్రిగారి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్డీవో సువర్ణ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తోందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్ మాట్లాడుతూ యువత చిన్నపాటి ఉద్యోగాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగంలో ముందుకు వచ్చి పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక వ్యాపారులకు, యువ పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.









