రేబాలలో డా.అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

– ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

– అంబేడ్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు

– ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 24 (జనస్వరం) : మండలంలోని రేబాల గ్రామం తూర్పు హరిజనవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.

అనంతరం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని, ముఖ్యంగా యువత అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పంచాయతీల్లోగానీ, కాలనీల్లోగానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని, లేదంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. కాలనీలకు అవసరమైన అభివృద్ధి పనులను కోరే హక్కు ప్రజలందరికీ ఉందన్నారు. పేదలకు సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలని సూచించారు. వర్గాలు, విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేసుకున్నప్పుడే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

See also  వాతావరణ కాలుష్యంపై జనసేన పోరాటం