నెల్లిమర్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే లోకం మాధవి ప్రత్యేక దృష్టి

నెల్లిమర్ల/విజయవాడ, జనవరి 9, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC)తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడేందుకు కొత్తగా బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, మురుగునీటి సమస్యల పరిష్కారానికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి గ్రామంలో డ్రైనేజీ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని సూచించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేసి, పనులు వేగంగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కోరారు. అలాగే నిర్మాణ పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అని, రహదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. అధికారుల నుంచి సానుకూల స్పందన లభించిందని, త్వరలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభమవుతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

See also  విజయనగరం జిల్లాలో జగనన్నఇళ్ళు నిర్మాణ దశలోనే కూలిపోతున్న గృహాలు