
– పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
– పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సన్మానం
– నియోజకవర్గంలో 34,253 మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ కింద రూ.51.37 కోట్లు
బుచ్చిరెడ్డిపాళెం, జూలై 24 (జనస్వరం): మండలంలోని రేబాల జడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు సెల్యూట్ చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్క నాటి, తరగతి గదులు, వంటగదిని పరిశీలించి, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం తెలుగు తల్లి గీతంతో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పదో తరగతిలో 567 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన సువర్చల, ద్వితీయ స్థానంలో నిలిచిన అంకిత, తృతీయ స్థానం సాధించిన చక్రిని, వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం ఎంతో అవసరమన్నారు. పిల్లల చదువు, ప్రవర్తన, భవిష్యత్తుపై ఉపాధ్యాయులకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, తల్లిదండ్రులు తరచూ ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. ఈ ఆలోచనతోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తామని, కుటుంబంలో చదివే ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ఇటీవలే రెండో ఏడాది ‘తల్లికి వందనం’ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేశామని, కోవూరు నియోజకవర్గంలో మొత్తం 34,253 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.51.37 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తిస్తోందని, ఒక కుటుంబానికి రూ.52 వేల వరకు ఆర్థిక సహాయం అందిన ఉదాహరణ కూడా ఉందన్నారు. విద్యార్థుల కోసం మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, డొక్కా సీతమ్మ పథకం ద్వారా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలు, షూలు, పుస్తకాలు, బ్యాగులు అందజేస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన పాఠశాల భవనాలను పూర్తి చేస్తున్నామని, రేబాల జడ్పీ హైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది పాఠశాలకు ప్రహరీ నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందుతుండటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజూ కొంత సమయం పిల్లలతో గడిపి వారి చదువు గురించి తెలుసుకోవాలని, స్మార్ట్ఫోన్లకు వీలైనంత దూరంగా ఉంచాలని సూచించారు. ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బెజవాడ జగదీశ్, కూటమి నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, మన్నేపల్లి శ్రీనివాసులు, రమణారెడ్డి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.








