
అనంతపురం, మార్చి 1, (పెన్నా టైమ్స్) : పేద రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి రుణమాఫీ చేపట్టి రైతన్నలను ఆదుకోవాలని ఆల్ ఇండియా పీహెచ్పీఎస్ ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వృత్తుల వారికి తమ సేవలకు రేట్లు నిర్ణయించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ రైతులకు తమ పంటలకు ధర నిర్ణయించే హక్కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా, పంట నష్టం భీమా వెంటనే మంజూరు చేయాలని, పంటలకు రైతులే ధర నిర్ణయించుకునే విధానాన్ని అమలు చేయాలని కోరారు. గిట్టుబాటు ధరలు లేక పురుగుమందు సేవించడం, రైళ్ల కింద పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలను అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. పేద రైతులకు మూడు ఎకరాల భూమి ఉచితంగా కేటాయించడంతో పాటు సబ్సిడీపై బోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలను అన్యాయంగా కొట్టే అధికారులపై తక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.








