మాకొడికి తాండా పాఠశాలకు మహేష్ నాయక్ భారీ విరాళం

శెట్టూరు, ఫిబ్రవరి 11, (జనస్వరం) : ఉన్నత చదువులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడిన వారు తమ పుట్టిన ఊరిని, చదువుకున్న బడిని మరవకుండా అండగా నిలిస్తే ఆ గ్రామ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుంది. అదే విధంగా మాకొడికి తాండాకు చెందిన మహేష్ నాయక్ తన గ్రామ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చి రూ.50,000 విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం హిందూపురంలో హార్టికల్చర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మహేష్ నాయక్, పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ పుట్టిన గడ్డపై ఉన్న మమకారంతో పాఠశాల అవసరాల కోసం ఈ సహాయం ప్రకటించడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ప్రకటించిన విరాళంలో తొలి విడతగా రూ.30,000 మొత్తాన్ని ఆయన తండ్రి శంకర్ నాయక్ పాఠశాలకు అందజేశారు. ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులకు ఈ మొత్తాన్ని అందించారు. మిగిలిన రూ.20,000 మొత్తాన్ని కూడా త్వరలోనే పాఠశాల అభివృద్ధి పనుల కోసం అందజేస్తామని మహేష్ నాయక్ తెలిపారు. ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ సామాజిక బాధ్యతతో సొంత ఊరి బడికి చేయూతనిస్తున్న మహేష్ నాయక్‌ను గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.

See also  కదిరి జనసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు