
ప్రైవేట్ కరోనా ఆసుపత్రులను కట్టడి చేయాలని కడప జనసేన నాయకుల వినతి
కడప జిల్లాలో రోజురోజుకు కోవిద్ మహమ్మారి ప్రబలుతున్న విషయం తమరికి విధితమే ఈ మహమ్మారి బారిన పడిన ప్రజలు చికిత్స చేయించుకునే నిమిత్తం ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి కడప జిల్లాలోని కోవిడ్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సేవా తత్పరతతో రోగులకు వైద్య సేవలు అందించవలసిన సదరు ప్రైవేటు ఆస్పత్రుల వారు సిండికేట్ గా మారి ప్రజలను నిలువు దోపిడీ చేయడం మొదలుపెట్టారు. చికిత్సకు అత్యవసరమైనటువంటి ఆక్సిజన్ పేరు మీద మరియు ఔషధాల పేరుమీద అత్యధికంగా చార్జీలు విధించి ప్రజల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఆసుపత్రుల వారు ఆక్సిజన్ మరియు ఔషధాలకు విధించిన ఛార్జీలను కట్టలేని వారు అవే ఔషధాలు ఆక్సిజన్ బయటనుండి తామే కొని తెచ్చుకునే అవకాశం కల్పించమని ప్రాధేయ పడినప్పటికీ కనికరం లేకుండా దుర్మార్గం గా వ్యవహరిస్తున్నారు. అయ్యా, ఈ దేశంలో పౌరులందరికీ జీవించే హక్కు ఉన్నది. కోవిడ్ 19 బారిన పడిన పౌరుల జీవించే హక్కుకు భంగం వాటిల్లకుండా కాపాడేందుకే జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చినది. కానీ సదరు పౌరుల జీవించే హక్కుకు భంగం వాటిల్లే విధంగా ప్రైవేటు ఆసుపత్రుల వారు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే అనేకమంది కోవిడ్ బారిన పడిన అమాయక ప్రజలు తమ విలువైన ప్రాణాలను అటు కోవిడ్ కారణంగా లేదా ఇటు ఆర్థిక భారాన్ని మోయలేని కారణంగానో కోల్పోవాల్సిన దుర్గతి ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఈ విషయమై పూర్తిగా విచారించి కోవిడ్ బారిన పడిన పౌరులు కోరుకున్న ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించడానికి వీలుగా, అత్యవసర మైనటువంటి ఆక్సిజన్ మరియు ఔషధాలు పౌరులు కోరుకున్నట్లు అయితే వారే కొనుగోలు చేసి తెచ్చుకునేందుకు వీలుగా జిల్లాలో అనుమతి పొందినటువంటి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వారు అవకాశం కల్పించే విధంగా నిబంధనలను రూపొందించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగాను, అవకాశం ఉన్న మేరకు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉన్నటువంటి ఈ రోగులకు ఔషధాలు మరియు వైద్య పరికరాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ సంజీవిని మందుల షాపు నుండి సరఫరా చేసే విధంగా చూడాలని తద్వారా కోవిద్ బారిన పడిన టువంటి పౌరులు తగిన వైద్య సహాయాన్ని పొంది కోలుకోవడానికి జీవించడానికి అవకాశం కల్పించవలసిందిగా, వారి జీవించే హక్కును కాపాడాలని కోరుకుంటున్నామని కడప జనసేన పార్టీ లీగల్ సెల్ తోట బాలసుబ్రహ్మణ్యం, నగర అధ్యక్షులు మాలే శివ విజ్ఞప్తి చేస్తున్నారు.









