
నెల్లూరు, డిసెంబర్ 15, (జనస్వరం) : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు సిటీ ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన ఆయన త్యాగం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం మొండి పట్టుదలతో ఆశయాన్ని ముందుకు నడిపించిన శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచుగా గుర్తు చేస్తుంటారని తెలిపారు. జనసేన ఆవిర్భావ సభలో కూడా సభా ప్రాంగణానికి ‘శ్రీ పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణం’ అని పేరు పెట్టి ఆయన త్యాగానికి గౌరవం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. తన సౌకర్యాన్ని పక్కనపెట్టి సమాజం కోసం జీవించిన శ్రీరాములు, ప్రత్యేక రాష్ట్రం కోసమే కాకుండా స్వాతంత్ర్య ఉద్యమంలోనూ అనేక సత్యాగ్రహాలు, నిరసనల్లో పాల్గొన్నారని వివరించారు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం జిల్లావాసులందరికీ గర్వకారణమని నాయకులు పేర్కొన్నారు. జిల్లా పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’గా పేర్కొనాలని కీ.శే. కేవీ చలం గుర్తు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని భావితరాలకు అందిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా జనసేన పార్టీ పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన నాయకులు గుర్రం కిషోర్, ఆత్మకూరు సుధాకర్, నగర కార్యదర్శి హేమచంద్ర యాదవ్, 49వ డివిజన్ నాయకులు హరి, 6వ డివిజన్ నాయకులు కొమ్మినేని వెంకటరమణ, 16వ డివిజన్ నాయకులు నరహరి, 18వ డివిజన్ నాయకులు వర్షన్, 29వ డివిజన్ నాయకులు కృష్ణారెడ్డి, 13వ డివిజన్ నాయకులు పెనేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








