
తిరుపతి, అక్టోబర్ 6, (జనస్వరం) : తిరుమల తిరుపతి వ్యవహారాలపై జగన్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి తీవ్రంగా విమర్శించారు. స్వామివారి ఆస్తులు, ధార్మిక వ్యవహారాలపై తేలికపాటి వ్యాఖ్యలు చేయడం ప్రజలు సహించరని ఆయన అన్నారు. జయరాం రెడ్డి మాట్లాడుతూ, గత పాలనలో జరిగిన అవినీతి కేసులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఇంకా కోర్టుల్లో ఉండగా, పరకామణి కేసులో జరిగిన 9 డాలర్ల దొంగతనాన్ని చిన్న విషయం అని భావించడం భక్తులను బాధపెట్టే అంశమని తెలిపారు. స్వామివారి సేవలు, హుండీ నిధులు భక్తుల విశ్వాసానికి సంకేతమని, రూపాయి కూడా దుర్వినియోగం కావడం పెద్ద సమస్యేనని పేర్కొన్నారు.
ధార్మిక అంశాలపై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. హిందూ సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల గౌరవం చూపించడం ప్రతి ప్రజా ప్రతినిధి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం NDA కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉండగా, బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైసిపి పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యక్షంగా చర్చించాలన్నారు. జనసేన శ్రేణుల్లో జై జనసేన, జైహింద్ నినాదాలు వినిపించాయి. జయరాం రెడ్డి ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.








