అంబేద్కర్ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు

నెల్లూరు, అక్టోబర్ 6, (జనస్వరం) : బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జనసేన నాయకులు నెల్లూరు సిటీ వి ఆర్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అసమానతలు, దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు. జనసేన నాయకుడు గునుకుల కిషోర్ పేర్కొంటూ, అంబేద్కర్ చూపిన మార్గం సమాజ అభ్యున్నతికి దారి తీసేదని అన్నారు. రాజ్యాంగ రచన, సామాజిక న్యాయం, కులవివక్ష నిర్మూలన, దళితుల అభివృద్ధి కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినదన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక్క వర్గానికే చెందినవారు కాదని, ప్రపంచం గర్వించదగ్గ భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు, హక్కులు, విధులను స్పష్టంగా వివరించిన అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ సమాజానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.

అభివృద్ధి ఫలాలు అన్నివర్గాలకు చేరేలా కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో చూసిన అసమానతలను తొలగించేందుకు కృషి చేస్తూనే ఉన్నారని నాయకులు తెలిపారు. నెల్లూరు సిటీలో మంత్రి పొంగూరు నారాయణ 1000 మందికి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, రానున్న రోజుల్లో 150 కోట్ల రూపాయలతో 15 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మందికి ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని వారు వివరించారు. జనసేన నాయకులు అంబేద్కర్ చూపిన సమానత్వ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలను పాటిస్తూ పనిచేస్తామన్నారు. జై జనసేన, జై భీమ్, జైహింద్ నినాదాలు కార్యక్రమ స్థలంలో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కార్యాలయం ఇన్‌చార్జ్ జమీర్, గుర్రం కిషోర్, హేమచంద్ర యాదవ్, నరహరి, నాగేంద్ర బాలు, వర్షన్, నాని, చెంచయ్య, హర్ష తదితరులు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ దెబ్బకు జగన్ చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు