ఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ

– ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ యోగా ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో యోగా సాధన

– 100 మందికి పైగా పాల్గొన్న యోగా ప్రేమికులు

న్యూఢిల్లీ, జూన్ 21 (జనస్వరం): అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సందర్భంగా న్యూఢిల్లీలోని మింటో రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ కాంప్లెక్స్‌లో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ యోగా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో, ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగాచార్య పింకీ చంద్ర మార్గదర్శకత్వంలో డా. ఎస్. ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మింటో రోడ్ కాంప్లెక్స్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ జీపీఆర్‌ఏ క్వార్టర్స్, గాంధీ మార్కెట్, పాత ఢిల్లీ ప్రాంతాలతో పాటు సమీప కాలనీలకు చెందిన యోగా సాధకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన యోగా ప్రోటోకాల్ ప్రకారం తాడాసనం, త్రికోణాసనం, వజ్రాసనం, ఉత్తాన మండూకాసనం, ఉత్తానపాదాసనం, మకరాసనం, పవనముక్తాసనం తదితర యోగాసనాలను అభ్యసించారు. అలాగే కపాలభాతి, శీతలి ప్రాణాయామం, భ్రమరి, అనులోమ-విలోమ ప్రాణాయామాలను సాధిస్తూ వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన పొందారు. ఈ సందర్భంగా యోగాచార్య పింకీ చంద్ర మాట్లాడుతూ యోగా, ప్రాణాయామం, ధ్యానం అనేవి సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆనందానికి మార్గాలని పేర్కొన్నారు. ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయం యోగా సాధనకు కేటాయించాలని, పిల్లల్లో కూడా యోగా పట్ల ఆసక్తి పెంపొందించాలని సూచించారు. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఆరోగ్యవంతమైన సమాజం, అభివృద్ధి చెందిన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సీఈవో డా. ఎస్. ఆదినారాయణ మాట్లాడుతూ యోగా, ప్రాణాయామం, ధ్యానం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రతిరోజూ యోగా సాధన చేస్తున్న వారిని అభినందిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనగా, యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, పాల్గొన్న యోగా సాధకులు ఆనందం వ్యక్తం చేశారు.

See also  విజయవంతంగా 109వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట