
– భారత్ ప్రతిష్టను చాటిన ప్రసంగం
-110 దేశాల ప్రతినిధుల హాజరు
అమరావతి, ఏప్రిల్ 16, ( జనస్వరం ) : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్వహించిన యునైటెడ్ నేషన్స్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్నికల వ్యూహకర్త, రఫియన్ గ్రూప్ అధినేత డా. సయ్యద్ మహమ్మద్ రఫీ భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ వాణిజ్యం, విద్య, వైద్యం, యువత అభివృద్ధి వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాల నేపథ్యంలో శాంతి అవసరాన్ని డా. రఫీ ప్రస్తావిస్తూ, అన్ని దేశాలు యుద్ధాలను నిలిపివేసి శాంతి మార్గంలో ముందుకు సాగాలని కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే విద్యా, వైద్య రంగాలు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని వివరించారు. భారత యువత ప్రతిభ, అభివృద్ధి అవకాశాలను ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ వేదికపై భారత దేశ ఔన్నత్యాన్ని చాటారు. భారత్–థాయిలాండ్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను కూడా గుర్తు చేశారు. ఈ సమావేశాలకు సుమారు 110 దేశాల నుండి రాయబారులు, మంత్రులు, అంబాసిడర్లు, ఎంపీలు, కాన్సులేట్ జనరల్స్, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.









