
పెంచిన రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలి- “జనసేన వీరమహిళ” కొలసాని లక్ష్మీ డిమాండ్
పదిరోజుల్లో రెండు సార్లు చమురు కంపెనీలు రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను వెంటవెంటనే పెంచడం సమంజసం కాదని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ జనసేనపార్టీ వీరమహిళ నూతలపాడు కొలసాని లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచడంతో ప్రజలపై పెనుభారం పడుతోందన్నారు. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నఫళంగా ఒక్కో సిలిండర్ పై యాభై రూపాయలు పెంచుతూ ఈనెల ఐదోతేదీన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కోవిడ్ కారణంగా ప్రజలు ఆదాయ మార్గాలు అంతంతమాత్రం గానే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాబడిలేకుండా అల్లాడి పోతుంటే.. ధరలు పెంచి కనీసం పదిరోజులు గడవకనే మళ్ళీ రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలు మరో మారు యాభై రూపాయలు పెంచడం అత్యంత దారుణం అని ఆమె మండిపడ్డారు. ఈవిధంగా చేయడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డచందంగా ఉందన్నారు. అసలే కరోనా విపత్కాలంలో పనులు లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిన సామాన్య ప్రజలపై వంటగ్యాస్ కంపెనీలు కనికరంలేకుండా వినియోగదారులైన సామాన్యులపై భారం మోపడం భావ్యమా? సమంజసమా? అని ఆమె ప్రశ్నించారు. ఒక్కో గ్యాస్ సిలిండర్పై మళ్ళీ ఈరోజు మరో రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయని తెలిపారు. పర్చూరు నియోజక వర్గంలో ఇదివరకు డిసెంబర్ మొదటి వారంలో ఒక్కో రాయితీ గ్యాస్ సిలిండర్ ధర 639 రూపాయలు ఉండగా.. వారం తిరగకముందే డిసెంబర్ ఐదో తారీఖున పెంచిన ధరల మూలంగా 689 రూపాయలు అయ్యిందన్నారు. మళ్ళీ ఇప్పుడు కేవలం పది రోజుల వ్యవధిలో మరో యాభై రూపాయలు పెచడంతో సామాన్య ప్రజలపై వందరూపాయలు ప్రత్యక్షంగా భారంపడి ఒక్కో సిలిండర్ రూ.739/- అయ్యిందని లక్ష్మీ పేర్కొన్నారు. ఇక పరోక్షంగా దీంతో పాటు రవాణా ఖర్చులు అదనంగా గ్యాస్ కంపెనీలు ముక్కుపిండి వసూలు చేయడం కూడా సామాన్యులపాలిట గుదిబండగా మారుతోందని ఆమె వాపోయారు. పెరిగిన ధరలు తక్షణమే అమలు లోకి వస్తాయని గ్యాస్ కంపెనీలు వెల్లడించడం చూస్తుంటే కష్టజీవులపై గ్యాస్ కంపెనీలకు కనికరం లేకుండా పోయిందన్నారు. చమురు మార్కెటింగ్ సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో సామాన్య వినియోగదారులపై మరింత భారం మోపారని కొలసాని లక్ష్మీ ఆవేదన వ్యక్తంచేశారు.. ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సామాన్య మహిళలందరూ సంఘటితమై ధరలు తగ్గించే వరకు ఉద్యమించి పోరాటం ఉధృతం చేస్తామని మరోసారి కొలసాని లక్ష్మీ హెచ్చరించారు.








