
– పోషకాహార, ఔషధ మొక్కల పెంపకానికి నిధుల మంజూరు
– సిఈఓ ఆవుల చంద్రశేఖర్ వెల్లడి
బుట్టాయగూడెం, ఏప్రిల్ 21, (జనస్వరం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషణ్ వాటిక కార్యక్రమం మెరుగైన ఫలితాలను అందిస్తోందని ఏపీ ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాల గురించి బుట్టాయగూడెం ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీఈఓ ఆవుల చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యాలయాల ప్రాంగణాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇళ్లవద్ద సేంద్రియపద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచే ఒక చిన్నతోట ఎంతో మార్పును తీసుకొస్తున్నదన్నారు. ఏలూరు జిల్లా (పాత పశ్చిమ గోదావరి) బుట్టాయగూడెంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించడం తనకు ఎప్పటికీ గుర్తుంటుంది అన్నారు. పాఠశాల ప్రాంగణంలో పోషకాహార, ఔషధ మొక్కల పెంపకానికి 7 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, సమగ్ర వికాసానికి తోడ్పడుతోందని సిఈఓ ఆవుల చంద్రశేఖర్ ప్రశంసించారు. 2020లో ప్రారంభమైన ఈ పాఠశాల సీబీఎస్ఈ గుర్తింపు పొంది, 6 నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తోందన్నారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్, దాదాపు 480 మంది విద్యార్థుల వసతి, విద్యకు సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో పోషణ్ వాటిక ద్వారా తాజా పోషకాహారం, స్థానికంగా పండించిన తాజా, రసాయన రహిత (ఆర్గానిక్) కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు, పిల్లల్లో విటమిన్లు, ఖనిజ లవణాల లోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. సేంద్రియ పద్ధతులతో, ప్రకృతి సిద్ధమైన ఎరువులతో, తక్కువ ఖర్చుతో కూడిన తోటపనిని ప్రోత్సహిస్తాయన్నారు. తాజా ఆహారం కోసం బయటి మార్కెట్పై ఆధారపడకుండా, స్థానిక సమాజాలను స్వయంసమృద్ధిగా మారుస్తాయన్నారు. ఔషధ మొక్కలు పెరిగి పోషణతో పాటు, ఆరోగ్యాన్ని పెంపొందించేలా, మూలికలైన తులసి, అలోవెరా, వంటివాటిని పెంచుతారన్నారు. ఈ చొరవ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఏపీ ఉప సిఈఓ ప్రదీప్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ మిశ్రా, సహాయ కార్యదర్శి రఘునాథ్, కన్సల్టెంట్ ఎస్. రంగారావు, ఎన్ ఈ ఎస్ టి ఎస్ కన్సల్టెంట్ జి కృష్ణారావు, కెమిస్ట్రీ లెక్చరర్ రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.








