ముంజేరు ప్రజా దర్బార్‌లో సమస్యలపై వెంటనే చర్యలు : ఎమ్మెల్యే లోకం మాధవి

ముంజేరు, అక్టోబర్ 6, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఆధ్వర్యంలో ముంజేరు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించబడింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ప్రధానంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూమి రికార్డుల్లో తప్పులు, హద్దుల వివాదాలు, గృహ నిర్మాణ స్థలాల కేటాయింపులో జాప్యం వంటి అంశాలను వివరించారు. అర్హులకు ఇల్లు స్థలాలు అందకపోవడం, విద్యుత్ స్తంభాల మార్పు, లో-వోల్టేజ్ సమస్యలు, సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల మరమ్మత్తులు, కాలువల్లో పూడిక తొలగింపు వంటి మౌలిక సదుపాయాల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. లోకం నాగ మాధవి ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఓపికగా విని, సమస్యల తీవ్రతను గుర్తించారు. వెంటనే సంబంధిత రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు. గృహ స్థలాల కేటాయింపు, రోడ్లు, కాలువల మరమ్మత్తుల పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆమె అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చూపిన స్పందన, వేగవంతమైన చర్యలను స్థానికులు అభినందించారు. ప్రజా దర్బార్ ద్వారా తమ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతున్నాయని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.

See also  జనసేన ఫ్లెక్సీలను చూస్తే, వైసీపీకి ఎందుకంత ఉలిక్కిపాటు