
నెల్లూరు, అక్టోబర్ 16, (జనస్వరం): గోమతి నగర్లోని జనసేన జిల్లా కార్యాలయంలో గత 18 నెలలుగా ప్రతి బుధ, శనివారం జరుగుతున్న జనవాణి కార్యక్రమంలో సామాన్య ప్రజల సమస్యలు నిరంతరం వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అనేక సమస్యలను అధికారులు మరియు కూటమి నాయకుల సహకారంతో పరిష్కరించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జరుగుతున్న జన జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమం సందర్భంగా ఆదివాసీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ భావిస్తోంది. ఈ సందర్భంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
జనవాణి కార్యక్రమంలో బుట్టలు కుట్టుకునే కుటుంబాల సమస్యలను వారి నాయకురాలు వివరించారు. ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు పట్టణంలో దాదాపు 50 కుటుంబాలు బుట్టల అల్లకం మీదే పూర్తిగా ఆధారపడి ఉన్న పరిస్థితిని ఆమె వివరించారు. ఈ సమస్యలన్నిటిని కూటమి పెద్దలకు వివరించి పరిష్కార మార్గాలు చూపిస్తామని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ హామీ ఇచ్చారు. స్థానిక కళాకారుల జీవన విధానాన్ని నిలబెట్టే చర్యలు తప్పనిసరని ఆయన అభిప్రాయపడ్డారు.








