రాధా–రంగా మిత్రమండలి మండల ఉపాధ్యక్షుడిగా గణేషుల చక్రవర్తి

కడియం, జూలై 23 (జనస్వరం): ఆంధ్ర–తెలంగాణ రాధా–రంగా మిత్రమండలి కడియం మండల ఉపాధ్యక్షుడిగా కడియం గ్రామానికి చెందిన గణేషుల చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి, మండల అధ్యక్షుడు నాగవరపు బాబీ నియామక పత్రాన్ని అందజేసి ఆయనను అభినందించారు. వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతను సేవాభావం వైపు ప్రోత్సహిస్తున్న చక్రవర్తికి ఈ బాధ్యతలు దక్కడం పట్ల రాధా–రంగా అభిమానులు, కాపు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చక్రవర్తి కుటుంబానికి దివంగత వంగవీటి మోహన రంగాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తండ్రి దివంగత గణేషుల రమణ కడియం మండలంలో రాధా–రంగా మిత్రమండలి కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా, కడియం మండలంలో తొలిసారిగా వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని కడియంలో ప్రతిష్ఠించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. తండ్రి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ చక్రవర్తి కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండటం విశేషమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గణేషుల చక్రవర్తి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జికి కృతజ్ఞతలు తెలిపారు. రాధా–రంగా ఆశయాలకు అనుగుణంగా మండలంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, యువతను సంఘటితం చేస్తూ మిత్రమండలిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కడియం మండలానికి చెందిన పలువురు కాపు నాయకులు, రాధా–రంగా అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చక్రవర్తిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రంగా ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

See also  చెవురు ప్రభుత్వ పాఠశాలలో స్టేజ్ నిర్మాణంకు దేవళ్ళ భాస్కర్ ఆర్థిక సాయం