భోగాపురంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం

భోగాపురం, నవంబర్ 12, (జనస్వరం) : ‘స్కిల్ ఇండియా’ స్ఫూర్తితో మహిళా సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నడుస్తున్న జన శిక్షణ సంస్థాన్ (JSS) విజయనగరం ఆధ్వర్యంలో భోగాపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి మాట్లాడుతూ నియోజకవర్గ మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పనదారులుగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలంటే సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక అవగాహన, మార్కెట్ అవకాశాలపై స్పష్టత అవసరమని చెప్పారు. తన భర్త, పారిశ్రామికవేత్త లోకం ప్రసాద్ అందించిన ప్రోత్సాహం తమ ప్రజాసేవా ప్రయాణానికి దిశా నిర్దేశమైందని తెలిపారు. “ఇంటికో వ్యాపారవేత్త” అనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె అన్నారు.

ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సహాయ బృందం ద్వారా శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీలు, బ్యాంక్ రుణాలు, మార్కెట్ కనెక్షన్ల వంటి అంశాలపై మార్గదర్శకత్వం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ బృందం క్యాంపు కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రెగ్యులర్ టైలరింగ్‌తో పాటు మిషన్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ వంటి అధునాతన శిక్షణను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు చిల్లర వ్యాపారాలకే పరిమితం కాకుండా, హోల్‌సేల్ ఉత్పత్తుల వైపు దృష్టి సారించాలని సూచించారు. భవిష్యత్తులో శిక్షణ పొందిన మహిళలను క్లస్టర్లుగా ఏర్పరచి నియోజకవర్గంలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ స్థాపించాలనే ప్రణాళిక ఉందని వెల్లడించారు. త్వరలోనే సుమారు 500 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, ఎంపీడీవో, ఈఓ పిఆర్‌డి, ఏఎంసీ వైస్ చైర్మన్ దుర్గ, ఎంపీపీ వాసుదేవ రావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  ఎస్.సి, ఎస్.టి శాశ్వత చట్టం ఏర్పాటు చేయాలి, సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి పెంచాలి : జనసేన నాయకులు ఆదాడ మోహనరావు